ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందుల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటన దిగుమసపల్లె పంచాయతీ పరిధిలోని బంగారెడ్డిల్లి గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం, దామోదరం (30) అనే వ్యక్తి తన భార్య నిర్మల (25), కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యకు విషం ఇచ్చిన అనంతరం తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేయగా ఘటన బయటపడింది. నిర్మలకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొంతకాలంగా చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది. ఆమెను చిత్తూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదని సమాచారం. భార్య అనారోగ్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు దామోదరాన్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బీఎన్ఆర్ పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.








కామెంట్లు (0)