ఆర్థిక సమస్యలతో భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తండ్రి
‘నా డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి’
సూసైడ్ నోట్ చూసి కన్నీరు మున్నీరైన బంధువులు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దంపతులు దామోదర్ (33), నిర్మల (30)కు కుమారుడు దిలీప్ (13), కుమార్తె శ్రీవిద్య (12) ఉన్నారు. కుమారుడు తొమ్మిదోవ తరగతి, కుమార్తె ఎనిమిదోవ తరగతి చదువుతున్నారు. నిర్మలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాణీపేట సిఎంసిలో వైద్య చికిత్స అందించారు. భార్యకు ఆరోగ్యం మెరుగుపడకపోవడం, వైద్యం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో దామోదర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పులు తీరే దారి లేకపోవడం, తాను చనిపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారన్న ఆవేదనతో మరింత కుంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యతో పాటు కుమారుడు, కుమార్తెకు మొదట విషమిచ్చి, ఆ తర్వాత ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని దామోదర్ ఆత్మహత్య చేసుక ున్నారు. సోమవారం ఉదయం దామోదర్ అక్క, బావ వచ్చి ఇంటి తలుపులు తట్టగా తెరవకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టారు. ఇంటిలోపల అందరూ మంచంపై విగత జీవులై ఉన్నారు. ఘటనపై ఎన్ఆర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోటులో దామోదర్ పేర్కొన్నారు. తన ఎటిఎం కార్డులో డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బును డ్రా చేసి తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియల ఖర్చులకు ఉపయోగిం చాలని లేఖలో కోరారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్య క్రియలకు కూడా తన డబ్బులే వినియోగించాలని లేఖలో పేర్కొనడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.







కామెంట్లు (0)