- వైసిపి అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, వైసిపి అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనిపై శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న వారిలో ఎక్కువమంది దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారేనని తెలిపారు. స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దీనిలో భాగంగానే వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారని, గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు వేయి ఉండే జీతాన్ని రూ.3 వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఎన్నికలముందు వారికి గతం కంటే మేలు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు వారిని తొలగించి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతామని, వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని కోరారు.
భాగ్యరాజ్ మృతిపై జగన్ సంతాపం
ప్రముఖ దర్శకుడు కె. భాగ్యరాజ్ మరణం బాధాకరమని జగన్ పేర్కొన్నారు. రచయితగా, సహాయ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి, తన ప్రతిభతో తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భాగ్యరాజ్ భారతీయ సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన, కథ స్క్రీన్ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి ఘన విజయాలు సాధించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.









కామెంట్లు (0)