- వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణం అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు విడుదల చేయాలి
- సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి - : వెలిగొండ ప్రాజక్టు నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పునరావాసం కల్పించి నీటిని విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ''శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు 2026 ఆగస్టుకి పూర్తిచేసి సెప్టెంబర్ 1వ తేదీన ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది హర్షణీయమే అయినప్పటికీ గతంలో ఇలాంటి గడువులు చాలా పెట్టి అమలు చేయకుండా ఆలస్యం చేశారు. ఇంకా చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. కృష్ణా జలాశయంలో నీళ్ళులేవు. వరదలొస్తే తప్ప నల్లమల సాగర్కు నీళ్ళివ్వలేరు. రిజర్వాయర్కు వదిలినా పంటకాల్వలు లేవు. ఈ పరిస్థితులను మరిచినీళ్ళు వదలాలనుకోవడం వివేకంకాదు. ఏదో సాధించామని గొప్పలు చెప్పుకోడానికి నిర్వాసితులను బలిచేయొద్దు.
నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్దాక్షణ్యంగా వ్యవహరిస్తోంది. నిర్వాసితులందరికీ ఇళ్ళస్థలాలు కూడా ఇవ్వకుండా చెల్లించాల్సిన ప్యాకేజీ చెల్లించకుండానే ఆగస్టు నెలాఖరుకు గ్రామాలు ఖాళీ చేయాలన్న కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో నిర్వాసితులు తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం 906 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు మూడోవంతు అంటే 306కోట్లే చెల్లించారు. మిగతా పరిహారం ఇస్తామంటూ ఊరిస్తూ కాలయాపన చేస్తున్నారు. గ్రామనాయకులు, బాధిత ప్రజలు కలెక్టర్ గారిని కోరినా ముందు ఖాళీ చేయండి, సమయం లేదంటూ ఎక్కడైనా పరదాలు కట్టుకుని వెళ్ళాల్సిందే నంటూ గ్రామాలు ఖాళీ చేయాలని బలవంత పెడుతున్నారు. విద్యుత్ సైతం కట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అప్పటికి గ్రామాలు ఖాళీ చేయకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమే కాదు అమానవీయం కూడా. భూసేకరణ చట్టాన్ని అనుసరించి అందరికీ పరిహారం చెల్లించిన అనంతరం కనీసంగా 6 నెలలు చట్ట ప్రకారం సమయం ఇవ్వాలి. బలవంతంగా ఖాళీ చేయించకూడదని సిపిఐ(యం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
11 గ్రామాలలోని 6,914 మందిలో కొద్ది మందికి వివిధ చోట్ల ఆరఅండఆర్ కాలనీల కోసమంటూ ఒక్కొక్క కుటుంబానికి ఐదు సెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించారు. ఇప్పటికీ మార్కాపురం మండలంలోని గొట్టిపడియ గ్రామానికి పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల గ్రామంలోని నిర్వాసితులకు ఇంటి స్థలాలు చూపించలేదు. మరో 13 ఎకరాల భూసేకరణ రైతులకు ధర చెల్లించ నందున పూర్తి కాలేదు. ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించనందున ఇంటి స్థలాలు పొందినవారు కూడా ఇళ్ళు నిర్మాణం చేసుకోలేకపోయారు.
గతంలో ప్రకటించిన 3,901 కుటుంబాలతో పాటు 2019 ఆగస్టు 31వతేదీ నాటికి 18సం॥ నిండిన యువతీ, యువకులందరినీ కుటుంబంగా పరిగణించి మరో 3,013 మందిని అర్హులుగా తేల్చి ఆరఅండఆర్ ప్యాకేజీ వన్టైం సెటిల్మెంట్ చెల్లించుటకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇంకా 4,464 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదు. 18 సం॥ నిండినవారు మరో 1,500 మందినికూడా లెక్కించి నష్టపరిహారం చెల్లించాల్సిఉంది. మరోవైపు పెళ్లయిన యువతులకు మొండిచెయ్యి చూపిస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు వాటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చింది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 2019వ సంవత్సరం చివరి నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు నిర్వాసితులకు పరిహారం చెల్లించనూలేదు. కావున గడువు పొడిగింపు దృష్ట్యా 2026 జూలై వరకు కట్ ఆఫ్ తేదీగా ప్రకటించి వెంటనే పునరావాస ప్యాకేజీ పూర్తిగా అందించి నీళ్లు వదలాలని'' సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.








కామెంట్లు (0)