- అక్టోబర్ 10 నుంచి పరీక్షలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2011 కంటే ముందు నియమితులై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరూ టెట్లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ, మున్సిపల్, రెసిడెన్షియల్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ టెట్ను నిర్వహించనుంది. ఈ నెల 25వ తేది నుంచి సెప్టెంబర్ 29వ తేది వరకు అభ్యర్ధుల నుంచి http://cse.ap.gov.in/, tet2dsc.apcfss.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా నోటిఫికేషన్లో వెల్లడించారు. ఒక్కొ పేపర్కు రూ.1000ల చొప్పున అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 5 నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 11 నుంచి 21వ తేది వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పూటలా ఈ పరీక్ష జరగనుంది. 150 మార్కులకు నిర్వహించనున్న ఈ పరీక్షకు ఒసి అభ్యర్ధులు 60శాతం, బిసి అభ్యర్ధులు 50శాతం, ఎస్సి,ఎస్టి, వికలాంగ, ఎక్స్ సర్వీస్మెన్లు 40శాతం చొప్పున అర్హత సాధించాలని నిర్ణయించింది. అభ్యర్ధులకు ఎలాంటి సందేహాలు ఉన్నా పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో ఉన్న 8121947387, 7995649286,6281704160 హెల్ప్ డెస్క్ నంబర్లను సంప్రదించాలని స్పెషల్ టెట్ కన్వీనర్ ఎంవి వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 10వ తేది నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
ఉపాధ్యాయులకు ఉపయోగం లేదు: పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి
ప్రత్యేక టెట్కు, సాధారణ టెట్కు ఎటువంటి తేడా లేదని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక టెట్ను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం - 2015 లోని '23(1)' సవరణను అమలు చేస్తే తొలిగే ఇబ్బందులకు, 20-25 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. అందరికీ కనీస అర్హత మార్కులు 35శాతం గానీ, లేదంటే ఆయా ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టులలో తగిన వెసులుబాటు కల్పించాలని కోరారు. పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో కాకుండా రాత పరీక్ష నిర్వహించాలని కోరినా మినహాయింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రత్యేక టెట్ వల్ల ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేదని యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ మరో ప్రకటనలో తెలిపారు. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)