ఏలూరు : భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాలుపంచుకోనున్నారు.
ముసునూరు గ్రామంలోని గౌర్మెట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా, ఆ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి నాన్-జీఎంఓ (జన్యుపరంగా మార్పు చేయని) పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి లాంఛనంగా ఆవిష్కరిస్తారు. అనంతరం పాప్కార్న్ సాగు చేస్తున్న మొక్కజొన్న రైతులను సత్కరించనున్నారు. వ్యవసాయ రంగంలో ఇది ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా భావిస్తున్నారు. ఈ పర్యటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఏలూరుకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని తెలిపారు. "రైతుల కోసం ఆవిష్కరణలు, వారికి మరింత విలువను సృష్టించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు" అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో .... అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా కార్యక్రమ ప్రాంగణాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి భద్రతా సిబ్బంది, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు, కృష్ణా జిల్లాల ఎస్పీలతో కూడిన ఉన్నత స్థాయి బృందం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించి భద్రతను సమీక్షించింది. ఉపరాష్ట్రపతి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముసునూరుకు ప్రయాణమయ్యారు.







కామెంట్లు (0)