రాష్ట్రానికి జనాభా అత్యవసరం
ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: వృద్ధుల కోసం ‘క్షేమం’ అనే కార్యక్రమాన్ని త్వరలో తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వృద్ధుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. యువతతో పాటు వృద్ధులు సమాజానికి ఆస్తిగా తయారుకావాలని అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోని అంబేద్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిం చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి జనాభా అత్యవసరమని తెలిపారు. జనాభా నియంత్రణ కాదని, జనాభా సంరక్షణ కీలకమని చెప్పారు. పిల్లలే రాష్ట్ర సంపద అని, వారితోనే ఆర్థిక ప్రగతి అని చెప్పారు. సంపద, అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తు పరిస్థితులు మారతాయ న్నారు. రాష్ట్రంలో చిన్నారుల సంఖ్య , అంగన్వాడీలు, పాఠశాలల్లో చేరే సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. ప్రతి వంద మందిలో 89 శాతం మందికి రెండో సంతానం లేదని అన్నారు. సంతానం వద్దనుకునే దంపతులు పెరగడం ఆందోళనకరమని అన్నారు. సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలొస్తాయన్నారు. పిల్లలే సంపద కార్యక్రమానికి నాంది పలుకుతున్నా మన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ సంతానోత్పత్తి రేటు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ వంటి జిల్లాల్లో సంతానోత్పత్తి రేటు అతి తక్కువగా ఉందన్నారు. పి4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతు న్నారని, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిల్లలను పెంచటం అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని.. తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యతని అన్నారు. కాన్పుల్లో సిజేరియన్లు తగ్గాలని, మహిళల ఆరోగ్య రక్షణ అత్యంత కీలకమని చెప్పారు. ఆడబిడ్డల చదువు కుటుంబానికి ఆస్తి లాంటిదని చెప్పారు. గతంలో వరకట్నం ఉండేదని, ఇప్పుడు ఎదురు కట్నం పరిస్థితికి వచ్చిందన్నారు. మహిళలకు ఉద్యోగాల్లో, కళాశాలల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నా మన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచే పిల్లల ఆరోగ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నా మని, పాఠశాలల్లో విద్య అందించేందుకు తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఇస్తున్నామన్నారు. 2047 నాటికి మన తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేర్చాలన్నదే తన సంకల్పమన్నారు. 2040కే స్వర్ణాంధ్ర సాధించే సత్తామనకుందని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధికి యువతే ప్రధాన ఆస్తిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ విధానాలు మారుతున్నాయని తెలిపారు. అనంతరం ‘పాప్యులేషన్ మేనేజ్మెంట్ ఫ్రేమ్ వర్క్’ డాక్యుమెంటును ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేశ్ కుమార్, కమిషనర్ కెవిఎన్ చక్రధర్బాబు, ఎన్టిఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశా, క్రియేటివ్, కల్చరల్ కమిషన్ ఛైర్మన్ తేజశ్వని తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)