- జైల్భరోలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలి
- వామపక్ష పార్టీలు
ప్రజాశక్తి - విజయవాడ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రవ్యాపితంగా జైల్భరో కార్యక్రమం జయప్రదం చేసినందుకు కార్మికులకు, రైతులకు వామపక్ష పార్టీలు అభినందనలు తెలియజేశాయి. ఈ మేరకు వారు ఉమ్మడి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో సుమారు 100 కేంద్రాల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు రాస్తారోకోలు, కేంద్ర కార్యాలయాల ముట్టడిలో వేలాదిగా పాల్గొన్నారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న శ్రీకాకుళం, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, నంద్యాల, విజయవాడ, ఉయ్యూరు సుమారు 10 జిల్లాల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్టులు చేయడాన్ని వామపక్షాలు ఖండిస్తున్నాయి. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజా నిరసనను పరిగణలోకి తీసుకొని కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని రూ.31వేలు కనీస వేతనం చెల్లించాలని, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం పునరుద్దరించాలని డిమాండ్ చేశాయి. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అమెరికాతో చేసుకున్న నష్టకర స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.







కామెంట్లు (0)