- రోడ్డెక్కిన ఎపి రిఫ్రాక్టరీస్ పరిశ్రమ రైతులు
ప్రజాశక్తి- గాజువాక (విశాఖపట్నం) ఎపి రిఫ్రాక్టరీస్ పరిశ్రమ కోసం తాము ఇచ్చిన భూములను తిరిగి తమకు ఇచ్చేయాలని కోరుతూ నిర్వాసిత రైతులు పోరుబాట పట్టారు. నాడు కేటాయించిన భూముల్లో 40 ఏళ్ల కాలం నుంచి పరిశ్రమ లేదని, అప్పట్లో ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని, అగనంపూడి, తలారివానిపాలెం, లక్కరాజువానిపాలెం, బొర్రపాలెం గ్రామాల రైతులు ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. అగనంపూడి సిగ్నల్ పాయింట్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన అన్ని నిర్వాసిత కాలనీల్లోనూ సాగింది. అనంతరం బొర్రం గుడి సమీపాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతు గవర నర్సింగరావు మాట్లాడుతూ 1984 నుంచి తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నామని తెలిపారు. అప్పట్లో ఎపి రిఫ్రాక్టరీస్ పరిశ్రమ కోసం 15 ఎకరాల భూమి సరిపోయినప్పటికీ, 174 ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత స్వల్ప కాలమే ఆ పరిశ్రమ పనిచేసి ఆ తర్వాత మూతపడిందన్నారు. భూములిచ్చిన వారికి పరిశ్రమలో ఉద్యోగాలిస్తా మన్న హామీని నమ్మి తమ భూములను కారుచౌకగా ఇచ్చామని తెలిపారు. అనంతర కాలంలో పరిశ్రమ, ఉద్యోగాలు లేక, నమ్ముకున్న భూమి లేక నిర్వాసిత రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చాయన్నారు. రూ.కోట్లు విలువైన ఈ భూమిని ప్రభుత్వం ప్రస్తుతం తీసుకోవాలని చూస్తోంద న్నారు. భూ నిర్వాసితుడు లక్కరాజు గోవిందరావు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామ న్నారు. అప్పట్లో ఎకరాకు రూ.1,250 నష్టపరిహారం మాత్రమే చెల్లించి భూములు తీసుకున్నారని తెలిపారు.








కామెంట్లు (0)