- నెల్లూరులో ఆక్వా రైతుల నిరసన
ప్రజాశక్తి-చిల్లకూరు : రొయ్యల కొనుగోలు ధరలు పతనం కావడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, స్థిరమైన గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఆక్వా రైతులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చిల్లకూరు మండల పరిధిలోని టోల్గేట్ సమీపంలోని ఓడూరు, పున్నప్పవారిపాలెం, రోడ్డు జంక్షన్ వద్ద నుంచి గాయత్రి ఆక్వా కంపెనీ వరకూ ర్యాలీ నిర్వహించారు. ధరల తగ్గింపుపై యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత పెన్వర్ ఆక్వా కంపెనీ డైరెక్టర్ మధుకృష్ణ నాయుడితో మాట్లాడారు. కొనుగోలు ధరల విషయంలో కంపెనీల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడంతో రైతులు కొంత మేర శాంతించారు. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు రవీందర్బాబు, రాష్ట్ర నాయకులు గోపీనాథ్, ఆవుల మనోహర్రెడ్డి మాట్లాడుతూ... ఓ వైపు రొయ్యల మేతల ధరలు, సాగు నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోగా, మరోవైపు అమ్మకం ధరలు తగ్గించడంతో కోలుకోలేని రీతిలో నష్టపోతున్నామని తెలిపారు. 20 కౌంట్ రొయ్యలకు రూ. 620, 30 కౌంట్ రొయ్యలకు రూ. 500, 40 కౌంట్ రొయ్యలకు రూ.400, 50 కౌంట్ రొయ్యలకు రూ. 300, పంగస్ రొయ్యలకు 80 శాతం మేర రేట్లు పెంచి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో మాట్లాడి గిట్టుబాటు ధరలు అమలయ్యేలా చూడాలని, ఆక్వా రైతాంగాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)