హైదరాబాద్ : కష్టజీవుల హక్కుల కోసం జీవిత చరమాంకం వరకు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి అంకిత భావంతో పోరాడారని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 3 గంటల సమయంలో సిపిఎం సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
సిపిఎం ప్రగాఢ సంతాపం ...
ప్రముఖ రైతు నాయకులు, తెలంగాణా సిపిఐ(యం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతికి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వరంగల్ జిల్లాలో విచ్ఛిన్నమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని తిరిగి పున: నిర్మించడంలోనూ, రాష్ట్రంలో రైతు సంఘాన్ని బలపరచడంలోనూ వారు ఎనలేని కృషి చేశారని అన్నారు. కష్టజీవుల హక్కుల కోసం జీవిత చరమాంకం వరకు అంకిత భావంతో పోరాడారని తెలిపారు. వారి కుటుంబాన్ని కూడా పార్టీ ఆశయాలతో నిలబెట్టారని అన్నారు. తాను రాష్ట్ర యువజన సంఘం బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. వరంగల్ లో జరిగిన యువజన ఉత్సవాల సందర్భంగా కలిసిమెలిసి పనిచేశామన్నారు. ఆ తర్వాత రాష్ట్ర రైతు ఉద్యమం బాధ్యతల్లో ఆయనతో సాహచర్యం ఏర్పడిందన్నారు. వారు తన సహచరులు అందరితోనూ చిన్న పెద్ద భావం లేకుండా స్నేహపూర్వకంగా ఉండేవారని తెలిపారు. మల్లారెడ్డి రాష్ట్ర కేంద్రానికి వచ్చిన తర్వాత తామిద్దరం ఒక టీముగా రైతు సంఘం విస్తరణకు కృషి చేశామన్నారు. ఆ తర్వాత కూడా చనిపోయేంతవరకు ఆయన రైతుల కోసం, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని వివరించారు. ఆఖరి శ్వాస వరకు అధ్యయనం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఇటీవల వారి కుమార్తె చనిపోవడం ఆయనను ఎంతగానో కృంగదీసిందని తెలిపారు. వారికి సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపున వ్యక్తిగతంగా తన తరపున జోహార్లకు ఇస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి భాగ్యలక్ష్మికి, వారి కుమారులు వాసు, మధుసూదన్ కు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.







కామెంట్లు (0)