ఆసుపత్రికి తరలించాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో పలు కేసుల్లో జైలులో ఉంటున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇమ్రాన్ను తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ధర్మాసనం మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లోగా ఇమ్రాన్ను షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 16 వరకు అక్కడే వుంచాలని పేర్కొంది. ఈ మేరకు ఇమ్రాన్ ప్రతినిధి నయీమ్ హైదర్ ఎక్స్ పోస్టులో తెలిపారు. క్రికెట్ నుండి రాజకీయాలకు మళ్ళిన ఇమ్రాన్ (73) 2023 ఆగస్టు నుండి జైల్లోనే వున్నారు. పలు కేసుల్లో ఆయన దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2022లో తాను పదవీచ్యుతుడైన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలతో మోపిన కేసులని ఆయన వాదిస్తున్నారు. కాగా గతేడాది కాలంగా తమ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన కుమారులు ఆందోళన వ్యక్తం చేస్తూనే వున్నారు. జైల్లో వుండగా ఆయన కుడి కంటి చూపు పోయిందని లాయర్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు స్వాగతించదగ్గవని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) ప్రతినిధి జుల్ఫీకర్ బుఖారి చెప్పారు. ఇది ముందే జరిగి వుంటే ఇంతలా ఆరోగ్యం దిగజారి వుండేది కాదని వ్యాఖ్యానించారు.








కామెంట్లు (0)