బిజినెస్ : బంగారం ధరలపై ప్రముఖ పెట్టుబడిదారుడు, రిడ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడుల ధోరణులపై తరచూ స్పందించే ఆయన ... తాజాగా బంగారం ధరల తగ్గుదలపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో ... ధరల కదలికలను తాను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. టెక్నికల్ చార్టుల్లో అనుకూల సంకేతాలు కనిపించిన తర్వాత మరింత బంగారం కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు.
ధర కంటే పరిస్థితులే ముఖ్యం : రాబర్ట్ కియోసాకి
పెట్టుబడుల విషయంలో కేవలం ధరలనే ఆధారంగా తీసుకోకూడదని రాబర్ట్ కియోసాకి సూచించారు. ఏ ఆస్తిలోనైనా పెట్టుబడి పెట్టే ముందు దాని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడం అవసరమని అన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతే ఆ ప్రాంత భవిష్యత్తు అవకాశాలను పరిశీలిస్తానని, బంగారం, వెండి వంటి విలువైన లోహాల విషయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రాజకీయ, బ్యాంకింగ్ వ్యవస్థల పనితీరును గమనిస్తానని వివరించారు. ప్రస్తుత ప్రపంచ నాయకత్వం ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం లేదని, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం ధరలను టెక్నికల్ చార్టుల ఆధారంగా పరిశీలిస్తున్నట్లు కియోసాకి తెలిపారు. ధరల పతనం ముగిసి తిరిగి పెరుగుదల సంకేతాలు కనిపించినప్పుడు కొనుగోలు చేయడం తన వ్యూహమని వివరించారు. అలాగే, బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉన్నట్లు టెక్నికల్ విశ్లేషణలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మకుండా, ప్రతి ఒక్కరూ స్వయంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
బంగారం ధరలు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని రాబర్ట్ కియోసాకి గతంలోనూ పలుమార్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ధరలు మరింత బలపడవచ్చని, దీర్ఘకాలంలో 2035 నాటికి ఒక ఔన్సు బంగారం ధర 35 వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులను దీర్ఘకాల పెట్టుబడుల కోణంలో పరిశీలించాలని ఆయన తరచూ సూచిస్తూ వస్తున్నారు.
గమనిక : ఇవి రాబర్ట్ కియోసాకి వ్యక్తిగత అంచనాలు మాత్రమే.








కామెంట్లు (0)