ముంబయి : అమెరికా స్టాక్ మార్కెట్లో గురువారం రాత్రి ప్రారంభమైన అమ్మకాల ఒత్తిడి శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముందుగా ఆపిల్ షేర్లు భారీగా క్షీణించగా, ఆ ప్రభావం క్రమంగా టెక్నాలజీ రంగంలోని ఇతర కంపెనీలకు విస్తరించింది. దీంతో ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోగా, దక్షిణ కొరియా మార్కెట్ అత్యంత తీవ్ర దెబ్బతిన్నది. అక్కడి ప్రధాన సూచీ కోస్పి భారీగా పతనం కావడంతో సర్క్యూట్ బ్రేకర్ అమలు చేసి ట్రేడింగ్ను కొంతసేపు నిలిపివేశారు.
ఈ క్షీణతకు ప్రధాన కారణంగా కృత్రిమ మేధస్సు (ఎఐ) రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల భారం కనిపిస్తోంది. డేటా సెంటర్లు, అత్యాధునిక చిప్లు, మెమరీ సర్వర్లు, విద్యుత్ మౌలిక వసతుల కోసం ప్రపంచ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, వాటికి తక్షణ లాభాలు కనిపించకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలం పాటు కంపెనీలు ఈ స్థాయి వ్యయాలను భరించగలవా అనే సందేహాలు వ్యక్తమవుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
దీనికి తోడు అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించిన దానికంటే ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. ఈ పరిణామాల ప్రభావం ముఖ్యంగా దక్షిణ కొరియా మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కోస్పి సూచీ ఎనిమిది శాతానికి పైగా క్షీణించడంతో మరింత పతనాన్ని అడ్డుకునేందుకు ఎక్స్ఛేంజ్ అధికారులు సర్క్యూట్ బ్రేకర్ అమలు చేసి ట్రేడింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఏఐ, మెమరీ చిప్ల తయారీలో అగ్రగాములైన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ (SK Hynix) కంపెనీల షేర్లు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు పడిపోవడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబించింది. జపాన్లోనూ నిక్కీ సూచీ భారీ నష్టాలను నమోదు చేయగా, ప్రముఖ పెట్టుబడి సంస్థ సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ షేర్లు దాదాపు 12 శాతం క్షీణించాయి. సాఫ్ట్బ్యాంక్కు చెందిన చిప్ డిజైన్ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ షేర్లు పడిపోవడం, ఓపెన్ఏఐ తన భారీ ఐపీఓను వచ్చే ఏడాదికి వాయిదా వేయవచ్చనే వార్తలు కూడా జపాన్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపాయి.
ఈ గ్లోబల్ మార్కెట్ పతనానికి మూలం అమెరికా వాల్ స్ట్రీట్లోనే కనిపించింది. ఐప్యాడ్, మ్యాక్బుక్ వంటి ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ఆపిల్ ప్రకటించిన అనంతరం ఆ కంపెనీ షేర్లు ఆరు శాతం మేర క్షీణించాయి. ఆ ప్రభావంతో మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మెటా వంటి ఇతర టెక్ దిగ్గజాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగి, టెక్నాలజీ ఆధారిత నాస్డాక్ సూచీ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలతో ముగిసింది. చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ, ఆపిల్ షేర్ల పతనం సృష్టించిన ప్రతికూల ప్రభావాన్ని అది అధిగమించలేకపోయింది.
ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం గ్రే మార్కెట్లో నిఫ్టీ సూచీపై ఇప్పటికే కనిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో మార్కెట్ల దిశను నిర్ణయించే అంశాలుగా అమెరికా హోల్సేల్ ఇన్వెంటరీ గణాంకాలు, వినియోగదారుల వ్యయాలకు సంబంధించిన కీలక ఆర్థిక గణాంకాలను పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









కామెంట్లు (0)