రామాపురం ప్రభుత్వ పాఠశాలలో రాము, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులున్నారు. వీరిద్దరూ కబడ్డీ జట్టులో మంచి ప్రతిభ గల ఆటగాళ్లే. అయితే సమయపాలన, క్రమశిక్షణను వీరు పాటించరు. కాస్త అలసత్వంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే ఆ పాఠశాలలకు కొత్తగా పిఇటి మాస్టార్గా ఆనంద్ గారు వచ్చారు. రోజూ జరిగే కబడ్డీ ప్రాక్టీస్కు రాము, కిరణ్లు ఆలస్యంగా వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఎందుకు ఇలా చేస్తున్నారని పిఇటి అడిగితే ‘మేము లేకుంటే టీమ్ గెలవబోదు’ అంటూ రాము గర్వంగా ఇచ్చిన సమాధానం ఆయనకు నచ్చలేదు. అప్పుడు వీరిద్దరికీ గుణపాఠం చెప్పాలని భావించిన సదరు మాస్టారు శాంతంగా ఆలోచించారు. క్రమశిక్షణ లేని ప్రతిభ, నీరు లేని బావిలాగా నిరుపయోగమంటూ వారికి ఉపదేశం కూడా ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు. అప్పుడు ఇక లాభం లేదని భావించిన ఆయన కబడ్డీ పట్ల ఆసక్తి ఉన్న సాధారణ ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి మంచి శిక్షణను ఇచ్చి పోటీలకు తయారు చేశారు. వారు ఎంచక్కా చక్కగా నేర్చుకుని అత్యద్భుతమైన ప్రతిభను చూపుతున్నారు. జట్టులోకి కూడా ఎంపికయ్యారు. రాము, కిరణ్లకు జట్టులో కూడా స్థానం లేకుండా పోయింది. ఇద్దరూ వచ్చి మాస్టారును కలిసి తమకంటే ఆడేవారు లేరనే భ్రమల్లో ఇప్పటివరకూ ఉన్నామనీ, ఇప్పుడు తమ తప్పు తెలిసిందని, ఇక నుంచి సమయపాలన, క్రమశిక్షణతో మెలుగుతూ చక్కగా ఆడి మంచి బహుమతులు గెల్చుకుంటామని చెప్పారు. సంతోషించిన పిటిఇ మాస్టారు ‘మీలో ఈ మార్పు కోసమే నా తపన’ అని క్షమించి ‘మంచిగా రాణించాలి’ అంటూ దీవించారు. ఇకపై అన్ని నియమాలు పాటిస్తామని మాట ఇచ్చి జట్టులోకి తిరిగి వచ్చారు. ఆనంద్ మాస్టారు కెప్టెన్ బాధ్యతను సాత్విక్ అనే క్రమశిక్షణ కలిగిన కుర్రాడికి అప్పగించారు. జిల్లాస్థాయి ఫైనల్ మ్యాచ్లో జట్టు సభ్యులంతా ఎంతో స్నేహపూర్వకంగానూ, ఐక్యమత్యంగా ఆడి అద్భుతమైన విజయం సాధించారు.
నీతి : క్రమశిక్షణ, సమయపాలన, ఐక్యమత్యం అనేవి విజయానికి సోపానాలు.
-ఇ.ఎస్.బి.కార్తికేయ
5వ తరగతి,
హార్వెస్టు పబ్లిక్ స్కూల్, ఖమ్మంజిల్లా.








కామెంట్లు (0)