ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): తల్లికి వందనం డబ్బు కోసం భార్యను గొంతుకోసి చంపాడో దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసమ్రుదం మండలం రాపూరివారిపల్లిలో సురేష్, పద్మావతి (30) దంపతులు వారి పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఇద్దరు కుమారులు 3, 5 తరగతులు చదువుతున్నారు. వారిద్దరికీ గురువారం తల్లికి వందనం డబ్బులు పద్మావతి ఖాతాలో జమవడంతో ఆ డబ్బు కావాలని సురేష్ వేధించాడు. రాత్రి మద్యం సేవించి పద్మావతిని చిత్రహింసలకు గురిచేశారు. డబ్బు ఇవ్వకపోవడంతో ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. గతంలోనూ తమ కుమార్తెను సురేష్ చిత్రహింసలకు గురిచేశాడని, చివరికి కడతేర్చాడని పద్మావతి తల్లి కళావతి, తండ్రి రామన్న కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఐద్వా
తల్లికి వందనం డబ్బుకోసం భర్తే భార్యను హత్య చేయడాన్ని ఐద్వా జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ ఖండించారు. భర్త ఆదరణ లేకపోయినా రోజువారీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్న మహిళను హత్య చేసిన సురేష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)