ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : సింగనోడ్డిపల్లి మరియు దిగువపాలెం నందు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారిని ఎం ఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అందిస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగిందన్నారు.ఎల్ నినో కారణంగా వర్షాలు సరిగా పడకపోతే రైతులకు పంట నష్టం వస్తుంది కాబట్టి దీనిని నివారించుకోవడానికి ప్రభుత్వం పంటల భీమా ప్రవేశ పెట్టిందని, రైతులు వరి, వేరుశనగ, కంది, టమోటో పంటలకు అన్నమయ్య జిల్లా రైతులు ప్రీమియం చెల్లించుకొని పంటల బీమా పొందవచ్చును అన్నారు
రైతులు తమ పొలాలలో వేసిన పంటలకు నష్టపరిహారంగా ఒక ఎకరం వేరుశనగ పంటకు రూ.540,వరి రూ.860,కంది రూ.300, టమోటో రూ.1600, నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుంది అన్నారు ఇందుకోసం రైతులు మీసేవ లేదా సి ఎస్ సి కేంద్రమునందు ఆధార్ పాస్ పుస్తకం ఫోన్ నెంబర్ తీసుకెళ్లి ఆన్లైన్ చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు. అదేవిధంగా రైతు సొంత ధృవీకరణ పత్రం సమర్పించాలని రైతులను ఆయన కోరారు.పొడి వాతావరణం కారణంగా రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నందున,రైతులు పసుపు అట్టలు ఎకరానికి 10 పెట్టు కోవాలని, అలాగే ఇమిడాక్లిప్రిడ్ 0.3 మి లీ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించినట్లు తెలిపారు. అనంతరం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు ఉన్న సమస్యలపై సందేహాలపై నివృత్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సేవ కేంద్రం సిబ్బంది లోకేష్, అనిత, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)