ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1952లో ఢిల్లీలో జన్మించిన ప్రదీప్ సింగ్ రావత్ హిందీ చిత్రం బాఘీతో సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం తెలుగు, తమిళ, హిందీ, నేపాలీ తదితర భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
తెలుగులో గజినీ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, సై చిత్రంలో భిక్షా యాదవ్ పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలాగే ఛత్రపతి, లక్ష్మీ, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు, స్టాలిన్ తదితర చిత్రాల్లో పోషించిన విలన్ పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గంభీరమైన రూపం, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రతినాయక పాత్రలకు ప్రత్యేకమైన ముద్ర వేశారు.
ఇటీవల ఒక నేపాలీ సినిమా షూటింగ్ను కూడా పూర్తి చేసిన ప్రదీప్ సింగ్ రావత్ మృతి సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.








కామెంట్లు (0)