హైదరాబాద్ : '' ఇలా చేస్తే యశ్ వస్తాడు’ అనే ఆలోచన తప్పు. నేను వెళ్తే ఇంకా చాలా మంది అలా చేయొచ్చు. అందుకే వెళ్లలేదు `` అని తన వీరాభిమాని గురించి హీరో యశ్ పేర్కొన్నారు. సాధారణంగా ఎవరైనా వీరాభిమాని చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులను సినీనటులు పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇస్తుంటారు. ఒకవేళ పరామర్శకు వెళ్లకపోతే విమర్శల పాలవుతారు. అలాంటి సందర్భమే కన్నడ హీరో యశ్ ఎదుర్కొన్నారు. గతంలో తన అభిమాని ఆత్మహత్య చేసుకుని చనిపోతే, ఆయన అంత్యక్రియలకు యశ్ హాజరు కాలేదు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా వివరించారు.
2021 ఫిబ్రవరిలో కర్నాటకలోని మాండ్య జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు సూసైడ్ నోట్ కూడా రాశారు. తాను యశ్ కి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకి పెద్ద అభిమానినని, వీళ్లిద్దరూ తన అంత్యక్రియలకు రావాలని అందులో రాసుకొచ్చారు. ఆ సమయంలో సిద్ధరామయ్య, రామకృష్ణ అంత్యక్రియలకు హాజరయ్యారు. యశ్ మాత్రం వెళ్లలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘అభిమాని చనిపోయినందుకు నాకూ చాలా బాధగా అనిపించింది. కానీ ‘ఇలా చేస్తే యశ్ వస్తాడు’ అనే ఆలోచన తప్పు. నేను వెళ్తే ఇంకా చాలా మంది అలా చేయొచ్చు. అందుకే వెళ్లలేదు. నా అభిమానులు ఏదైనా సాధించి రమ్మంటే నేను వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను. కానీ, ఇలాంటివి అస్సలు ప్రోత్సహించను. నా బాధ్యత ఏంటో అర్థం చేసుకుని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను’’ అని యశ్ తెలిపారు. ఇదిలా ఉండగా, యశ్ ప్రస్తుతం గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ (Toxic) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 26న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.








కామెంట్లు (0)