ఢిల్లీ : ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ను 2024 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 22న గుజరాత్లోని కేవడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అనంత నాగ్కు ఈ అవార్డును ప్రధానం చేయనుంది. కన్నడతో పాటు పలు భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించిన అనంత్ నాగ్కు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అనంత్నాగ్ కన్నడతో పాటు తెలుగు, హిందీ, మరాఠి, మలయాళ, ఇంగ్లిష్ భాషల్లో 300పైగా సినిమాల్లో నటించారు. థియేటర్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. 1973లో కన్నడ చిత్రం ‘సంకల్ప’ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘మంథన్’, ‘కొండుర’, ‘కల్యుగ్’ తదితర చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘మాల్గుడి డేస్’ లో ఆయన నటన దేశవ్యాప్తంగా అప్పట్లో విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.
బయలుదారి, కన్నేశ్వర రామ, గోది బణ్ణ సాధారణ మైకట్టు, రాజకుమార, గాలిపట-2, కేజీఎఫ్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగులో ప్రేమలేఖలు, అనుగ్రహం, భీష్మ, బాలు, శంఖారావం వంటి చిత్రాల్లో నటించారు. వెండితెర మీదే కాదు కర్ణాటక రాజకీయాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. మల్లేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’తో గౌరవించింది







కామెంట్లు (0)