శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు చిత్రాలకు ఎనిమిది పురస్కారాలు

3 గంటల క్రితం

telugu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:47 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

- ఉత్తమ చిత్రంగా 'ఆర్టికల్‌ 370'

- ఉత్తమ నటీనటులుగా యామి గౌతమ్‌, మమ్ముట్టి, కార్తిక్‌ ఆర్యన్‌

- ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు'

- పుష్ప–2కు రెండు విభాగాల్లో అవార్డులు

- బిజెపి అనుకూల చిత్రాలకు పెద్దపీట

​న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికి సంబంధించిన ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా 400కుపైగా చిత్రాలు తమ ముందుకు రాగా, వాటిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసినట్లు జ్యూరీ వెల్లడించింది. ఈసారి ఉత్తమ నటుడి విభాగంలో 'చందూ ఛాంపియన్‌' చిత్రంలో నటించిన కార్తిక్‌ ఆర్యన్‌, 'భ్రమయుగం' చిత్రంలో నటించిన మమ్ముట్టి సంయుక్తంగా ఎంపికయ్యారు. 'ఆర్టికల్‌ 370' చిత్రంలో నటించిన యామి గౌతమ్‌ ఉత్తమ నటిగా నిలిచారు. 'అమరన్‌' చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియాసామి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే నేపథ్యంలో రూపొందిన 'ఆర్టికల్‌ 370' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బిజెపి తరచూ ప్రస్తావించే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితం ఆధారంగా రూపొందిన 'స్వాతంత్ర వీర్‌ సావర్కర్‌' చిత్ర దర్శకుడు రణదీప్‌ హుడాకి ఉత్తమ తొలి దర్శకుడు పురస్కారం లభించింది. సనాతన భావజాలానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రచారం కల్పించిన మరికొన్ని చిత్రాలు కూడా పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న చారిత్రక, రాజకీయ ప్రచారానికి అనుగుణంగా రూపొందిన చిత్రాలకు ఈసారి జాతీయ పురస్కారాల్లో అధిక ప్రాధాన్యం లభించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​తెలుగుకు ఎనిమిది పురస్కారాలు

​ తెలుగు చిత్రాలు ఈసారి మొత్తం ఎనిమిది విభాగాల్లో పురస్కారాలకు ఎంపికయ్యాయి. కొణిదెల నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి వీర విక్రమ్‌ ఉత్తమ మేకప్‌ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. '35 చిన్న కథ కాదు' ఉత్తమ బాలల చిత్రంగా నిలవడంతో పాటు, ఆ చిత్రంలో నటించిన అరుణ్‌ దేవ్‌ పోతుల ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యారు. 'పుష్ప–2' చిత్రం మూడు విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైంది. సుకుమార్‌ ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే రచయితగా, దీపాలి నూర్‌, శీతల్‌ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా ఎంపికయ్యారు. 'లక్కీ భాస్కర్‌' చిత్రానికి వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా ఎంపికయ్యారు. 'కల్కి 2898 ఎడి' చిత్రానికి నితిన్‌ జిహానీ చౌధరి ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఎంపికయ్యారు. ఈ విధంగా ప్రాంతీయ చిత్రం, బాలల చిత్రం, బాలనటుడు, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు, కాస్ట్యూమ్‌ డిజైన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, మేకప్‌ తదితర విభాగాల్లో తెలుగు చిత్రాలకు మొత్తం ఎనిమిది పురస్కారాలు లభించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్