31 మందితో జెపిసి ఏర్పాటు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మైనారిటీ సంస్థలను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి, ఎన్జిఒలను పూర్తిగా అణచివేయడానికి ఉద్దేశించిన ఎఫ్సిఆర్ఎ సవరణ బిల్లుపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాస్పద బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపింది. రాజ్యాంగం మైనారిటీలకు కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తున్న ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను తిరస్కరిస్తూ, వివాదాస్పద బిల్లును జెపిసికి పంపాలంటూ లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ ఛైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులతో కూడిన జెపిసికి ఈ బిల్లును పంపాలన్న తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించడంతో, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. జెపిసి నివేదికను నవంబర్ లేదా డిసెంబరులో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజున సమర్పిస్తారు.
ఎఫ్సిఆర్ఎ బిల్లు మైనారిటీల హక్కులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. సభను నియంత్రించిన జగదంబిక పాల్, బిల్లును జెపిసికి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఈ బిల్లులో మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక్క నిబంధన కూడా లేదని, ప్రతిపక్షం అనవసరమైన అపార్థాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ను రద్దు చేసిన పక్షంలో, విదేశీ విరాళాలు, వాటి ద్వారా సృష్టించబడిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పించే నిబంధనలతో సహా, ఎఫ్సిఆర్ఎ బిల్లులోని అనేక నిబంధనలు దేశంలోని మైనారిటీ వర్గాలలో తీవ్ర ఆందోళనలను సృష్టించాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తడంతో, మార్చి 25న లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యను వాయిదా వేసింది. వివాదాస్పద బిల్లును కేవలం జెపిసికి పంపడం వల్ల అది లేవనెత్తుతున్న ప్రధాన సవాళ్లు, ఆందోళనలు పరిష్కారం కావని ప్రతిపక్షం వాదిస్తోంది.







కామెంట్లు (0)