మైసూరు: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి(88) కన్నుమూశారు. కర్ణాటకలోని మైసూరులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఎస్. జానకి మరణించినట్లు ఆమె మనవరాలు అప్సర వైద్యులు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఆమె మృతి వార్తతో సినీ, సంగీత రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి, ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కిపైగా భాషల్లో 50 వేలకుపైగా పాటలు ఆలపించి అరుదైన గుర్తింపు పొందారు. భావ వ్యక్తీకరణ, గాత్ర వైవిధ్యంతో "దక్షిణ భారత గానకోకిల"గా కోట్లాది మంది అభిమానుల మన్ననలు పొందారు.
సంగీత రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఆమె నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను అందుకున్నారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గాన మాధుర్యాన్ని అందించిన ఎస్. జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా నిలిచిపోతుంది.
ఆమె ప్రస్థానం :
భారతీయ సినీ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి (సిష్ట్ల జానకి) 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 1957లో సినీ గాయనిగా అరంగేట్రం చేసిన జానకి, తొలి ఏడాదిలోనే పలు భాషల్లో పాటలు పాడి తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కిపైగా భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి భారతీయ సినీ సంగీత రంగంలో అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె భావ వ్యక్తీకరణ, స్వర వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా స్వరాన్ని మలచే ప్రత్యేకత కారణంగా "దక్షిణ భారత గానకోకిల"గా అభిమానుల మన్ననలు పొందారు.
ఎస్. జానకి కెరీర్లో అనేక చిరస్మరణీయ గీతాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన యుగళగీతాలు తెలుగు సినీ సంగీతంలో చిరస్థాయిగా నిలిచాయి. శాస్త్రీయ సంగీతం, జానపదం, ప్రేమగీతాలు, భక్తిగీతాలు ఇలా అన్ని రకాల పాటల్లో ఆమె తనదైన ముద్ర వేశారు.
సంగీత రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఆమెకు 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 30కి పైగా రాష్ట్ర అవార్డులు లభించాయి. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఎస్. జానకి, భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన దిగ్గజంగా గుర్తింపు పొందారు.







కామెంట్లు (0)