- ఎస్ జానకి కన్నుమూత
మైసూరు : ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య ..’ అంటూ అభిమానులను సంగీత ఒడిలో ఊయలలూపిన గాన కోకిల, నాలుగు జాతీయ చలన చిత్ర అవార్డుల గ్రహీత ఎస్ జానకి (88) ఇకలేరు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జానకమ్మ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కన్నుమూశారంటూ ఆమె మనవరాలు అప్సర విద్యుల ప్రకటించారు. ఈ మేరకు ఆమె భావోద్వేగపూరితమైన ఒక నోట్ను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ఆమె కన్నుమూసే సమయంలో ఆమె చుట్టూ ఆమెకు కావాల్సిన వారంతా వున్నారని, ఆమె ప్రశాంతంగానే కన్నుమూశారని ఈ నోట్లో పేర్కొన్నారు. ‘ఈ విషాద సమయంలో తమ మనస్సులు భారంగా వున్నప్పటికీ, ఆమె అద్భుతమైన జీవితాన్ని గడిపినందుకు, తన కాలాతీతమైన సంగీతంతో లక్షలాదిమంది ప్రజలకు నిరంతర ఆనందాన్ని అందించినందుకు ఎంతో కృతజ్ఞతా భావంతో వున్నాం’ అని ఆ నోట్లో తెలిపారు. బయటి ప్రపంచానికంతా ఆమెది ఒక విశిష్టమైన, అద్భుతమైన స్వరం, లెక్కలేనన్ని స్మృతులను మిగిల్చిన పాటలను ఆమె ఆలపించారు. కానీ మా వరకు ఆమె ప్రేమమూర్తి నానమ్మ. ఆమె చూపిన ప్రేమ, కరుణ, దయ, వినయ, విధేయతలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’’ అని ఆ నోట్లో విద్యుల పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న ఆమె కుమారుడు కొన్నాళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. జానకమ్మ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టల ముఖ్యమంత్రులతో పాటు సినిమా రంగానికి చెందిన పలువురు తీవ్ర సంతాపం తెలిపారు.
గానకోకిల ప్రస్థానం
1938 ఏప్రిల్ 23న నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పల్లపట్ల గ్రామం (ప్రస్తుతం బాపట్ల జిల్లా)లో జానకి జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులోనే తొలిసారిగా స్టేజీపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు,.
1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయట్టు' ద్వారా నేపథ్య గాయనిగా సినీ ప్రయాణం మొదలెట్టిన జానకి.. అదే ఏడాది 6 భాషల్లో పాటలు పాడి తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడారు.. జానకి 1959లో వి.రామ్ప్రసాద్ను వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో సంగీత రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 1997లో గుండెపోటుతో రామ్ప్రసాద్ కన్నుమూశారు. 2016లో సినిమా పాటలు, ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు వీడ్కోలు పలికారు. అయినప్పటికీ 2018లో తమిళ చిత్రం 'పన్నాడి' కోసం మరోసారి తన గాత్రాన్ని వినిపించి అభిమానులను అలరించారు. జానకి అసాధారణ ప్రతిభకు గానూ.. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు లభించాయి. జానకమ్మ మరణంతో భారత సినీ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని, తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమలు, సంగీత విద్వాంసులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.
పదుల సంఖ్యలో పురస్కారాలు
ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల నుండి 30కి పైగా అవార్డులు పొందారు. 1986లో కలైమామణి అవార్డు, 1997లో ఫిలింఫేర్, 2002లో అచీవర్ అవార్డు, 2005లో జేసుదాసు అవార్డులు ఆమెను వరించాయి. 2009లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం ఆమెకు లభించాయి. మౌనపోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు జానకి. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' పురస్కారాన్ని, దక్షిణాది కళాకారులకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తోందని చెబుతూ ఆమె తిరస్కరించారు.








కామెంట్లు (0)