- ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో ఓ రెస్టారెంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సెయింట్ ల్యూక్స్ మ్యాజిక్ వ్యాలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ట్విన్ ఫాల్స్లోని ‘ఇన్-అండ్-అవుట్ బర్గర్’ రెస్టారెంట్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ రద్దీ ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతం ఎటువంటి ముప్పూ లేదని ట్విన్ ఫాల్స్ పోలీస్ చీఫ్ మాథ్యూ హిక్స్ ప్రకటించారు. కాల్పులు జరిపిన దుండగుడి గుర్తింపు, ఆయన ఉద్దేశం ఏమిటనే విషయాలను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ప్రత్యక్ష సాక్షులను ఇప్పటికీ విచారిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే, మృతుల సంఖ్యలో అనుమానిత దుండగుడు కూడా ఉన్నాడా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, బాధితుల పేర్లు, వయసు తదితర వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే, రెస్టారెంట్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నల్లటి దుస్తుల్లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి రైఫిల్తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండగా, ఆ దుండగుడిని నిలువరించేందుకు మరో వ్యక్తి పిస్టల్తో ఎదురుకాల్పులకు దిగాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు సూచించారని వారు తెలిపారు. దుండగుడు కనీసం మూడు నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు జరిపాడనే విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.








కామెంట్లు (0)