48.15 లక్షల మందికి మధుమేహం
2.82 కోట్ల మందికి ఎన్సిడి పరీక్షలు పూర్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 59.29 లక్షల మందికి అధిక రక్తపోటు (బిపి), 48.15 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా 11.79 లక్షల మందికి బిపి, 10.72 మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. అసాంక్రమిక వ్యాధులను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్సిడి 4.0 కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 2,82,38,795 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న జనాభాను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 66.05 శాతం పరీక్షలు పూర్తయ్యాయని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సర్వే పురోగతి నివేదికను మంత్రికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధర్బాబు అందజేశారు. 2025 సెప్టెంబరు 17న ప్రారంభమైన ఎన్సిడి 4.0 కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు 31 నాటికి 3,71,86,846 మందికి సర్వే పూర్తయ్యింది. రాష్ట్ర జనాభా (4,27,56,478)లో ఇప్పటి వరకు 2,82,38,795 మందికి పరీక్షలు (66.05 శాతం) జరిగాయి. కేన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా క్షేత్రస్థాయిలో అనుమానితులుగా గుర్తించిన 22,110 నోటి (ఓరల్) కేన్సర్, 14,822 రొమ్ము (బ్రెస్ట్) కేన్సర్, 18,837 గర్భాశయ ముఖద్వార ( సర్వైకల్) కేన్సర్ కేసులను తదుపరి పరీక్షల కోసం కేన్సర్ వైద్య విభాగాలకు పంపారు. తదుపరి పరీక్షల్లో 2,026 నోటి కేన్సర్, 3,571 రొమ్ము కేన్సర్, 2,076 గర్భాశయ ముఖద్వార కేన్సర్ కేసులు నిర్ధారణ య్యాయి. ఆయా కేసులకు సకాలంలో చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బిపి, మధు మేహం అధికంగా బాపట్ల జిల్లాలో, తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. సహజ ఆహారం, శారీరక శ్రమతో కూడిన జీవన విధానం వల్లనే అల్లూరి జిల్లాలో కేసులు స్వల్పంగా ఉన్నాయి. సర్వే కోసం ఇళ్లకు వచ్చే సిబ్బందికి సహక రించి స్క్రీనింగ్ చేయించుకోవాలని ప్రజలను కోరారు.








కామెంట్లు (0)