ఇరాన్ దివంగత సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఉంచారు. దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఖమేనీ అంత్యక్రియల్లో 14 నెలల చిన్నారి శవపేటిక అందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రాంగణానికి ఖమేనీ భౌతికకాయంతో పాటు, యుద్ధం తొలి దశలో ఆయనతో పాటే ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా తీసుకువచ్చారు. మృతుల్లో ఖమేనీ అల్లుడు, కుమార్తె, కోడలితో పాటు 14 నెలల వయసున్న మనవరాలి పార్థివదేహం కూడా ఉండటం అక్కడికి వచ్చిన ప్రజలను, విదేశీ ప్రతినిధులను కంటతడి పెట్టించింది. ఖమేనీ కుటుంబ సభ్యుల మృతితో ఇరాన్లో విషాద ఛాయలు అలుముకోగా, అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మంది ప్రజలు, దేశ విదేశాల ప్రతినిధులు వారికి ఘన నివాళులర్పించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక నేతలంతా హతమయ్యారు. దాదాపుగా 100 రోజులకు పైగా అంత్యక్రియలు జరపకుండా ఉంచారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా అంత్యక్రియలు చేపట్టారు. జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి.







కామెంట్లు (0)