మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో శనివారం అల్లురి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు.







కామెంట్లు (0)