అమెరికా : అమెరికాలోని అలస్కాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పశ్చిమ అలస్కాలోని ఒక మారుమూల రాడార్ కేంద్రం సమీపంలో చార్టర్డ్ విమానం కూలిపోయి ఎనిమిదిమంది మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు. జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB)ను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ (AP) ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. NTSB బోర్డు ఛైర్మన్ క్లింట్ జాన్సన్ వివరాల ప్రకారం ... ప్రమాదానికి గురైన విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం వెంటనే సహాయక, గాలింపు బృందాలు రంగంలోకి దిగాయని, అయితే విమానంలోని వారంతా అప్పటికే మృతి చెందారని అధికారులు తెలిపారు. రెండు ఇంజిన్లతో కూడిన సెస్నా చార్టర్ విమానం యాంకరేజ్ నుంచి కేప్ న్యూన్హామ్ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ అలస్కాలోని మారుమూల ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన ప్రాంతం గుడ్న్యూస్ బేకు దక్షిణంగా సుమారు 40 మైళ్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేప్ న్యూన్హామ్ ప్రాంతంలో వైమానిక దళానికి చెందిన రన్వే ఉంది. అక్కడి నుంచి దూర ప్రాంతంలో ఉన్న రాడార్ స్టేషన్కు ప్రవేశం ఉంటుంది.
విమానం కూలిపోయిన సమాచారం అందిన వెంటనే పలు సంస్థలు సహాయక చర్యలు ప్రారంభించాయి. NTSB, అలస్కా స్టేట్ ట్రూపర్స్, రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సిబ్బంది ప్రమాద స్థలానికి స్పందించారు. మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలు, ప్రమాదానికి సంబంధించిన వివరాల సేకరణలో సవాళ్లు ఎదురైనట్లు అధికారులు తెలిపారు. అమెరికా సైన్యం కూడా విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ఎనిమిది మంది మరణించినట్లు ధ్రువీకరించింది. ప్రస్తుతం విమానం ఎందుకు కూలిపోయిందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై NTSB దర్యాప్తు ప్రారంభించింది. వాతావరణ పరిస్థితులు, విమానం సాంకేతిక పరిస్థితి, పైలట్లకు సంబంధించిన అంశాలు తదితర కోణాల్లో దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. అధికారులు మరింత సమాచారం సేకరించిన అనంతరం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ ఘటనతో అలస్కాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సమాచారం అందించే ప్రక్రియతో పాటు, ప్రమాదానికి అసలు కారణాన్ని గుర్తించే దర్యాప్తు కొనసాగుతోంది.







కామెంట్లు (0)