వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ‘ట్రూత్ సోషల్’ వేదికగా చేసిన పోస్టులో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఒప్పందంపై సంతకం చేసినా, చేయకపోయినా తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం కోసం ఇరాన్ను అమెరికా ఆహ్వానిస్తోందంటూ ఏబీసీ న్యూస్లో వచ్చిన కథనం నిరాధారమని ట్రంప్ కొట్టిపారేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా కొత్తగా వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఫిబ్రవరిలో ఇరాన్తో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి హోర్ముజ్ జలసంధిని అమెరికా నియంత్రణలోకి తీసుకున్నట్లు ట్రంప్ పలుమార్లు ప్రకటిస్తున్నారు.
అమెరికా తాజా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ జోర్డాన్, బహ్రెయిన్, ఇరాక్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం. సోమవారం హోర్ముజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న రెండు చమురు ట్యాంకర్లపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.
హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలమార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. జలమార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ప్రపంచ చమురు ధర బ్యారెల్కు 4 డాలర్లకు పైగా పెరిగింది.








కామెంట్లు (0)