- ‘అది అనారోగ్యకర కుట్ర’ అంటూ వ్యాఖ్యలు
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ)పై మరిన్ని నియంత్రణలు, భద్రతా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఏఐ, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ‘అనారోగ్యకరమైన కుట్ర’ జరుగుతోందని ఆరోపించారు. ఏఐకి అదనపు నియంత్రణలు అవసరం లేదని, సమర్థవంతమైన అధ్యక్షుడి నాయకత్వమే సరిపోతుందని పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి విషయంలో అమెరికా చైనాపై ఆధిపత్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. ఏఐ రంగంలో అమెరికా వెనుకబడేలా చేసే చర్యలను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఏఐ, డేటా సెంటర్లపై వస్తున్న ఆందోళనల వల్ల ప్రయోజనం పొందేది చైనా మాత్రమేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించి, భద్రతా చర్యలను బలోపేతం చేయాలని పలువురు టెక్ రంగ ప్రముఖులు సూచిస్తున్నారు. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఏఐ అభివృద్ధిపై మరింత జాగ్రత్త అవసరమని హెచ్చరించారు. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా ఏఐ సామర్థ్యాలు భద్రతా చర్యలను మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వేగవంతమైన అభివృద్ధి అవసరమన్నది ట్రంప్ ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏఐ భద్రత, డేటా సెంటర్ల విస్తరణపై అమెరికాలో రాజకీయంగా కూడా చర్చ తీవ్రమవుతోంది.







కామెంట్లు (0)