రక్షాబంధన్ రోజున చాలామంది ఇళ్లలో గులాబ్ జామున్లు తయారుచేసుకుంటారు. ఈ పండక్కి పంచదార లేకుండా సహజమైన తీపి పదార్థాలతో గులాబ్ జామున్లు తయారుచేసి చూడండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికరమైన గులాబ్ జామున్లను ఇలా తయారుచేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు : గులాబ్ జామున్ మిక్స్ లేదా పన్నీర్, మైదా, పాలు, బేకింగ్ పౌడర్తో ఇంట్లో తయారుచేసిన పిండి, వేయించడానికి సరిపడా నూనె లేదా నెయ్యి, యాలకుల పొడి. అవసరమైతే కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు.
చక్కెరకు ప్రత్యామ్నాయంగా సిరప్ తయారీకి బెల్లం, ఖర్జూరం లేదా తేనెను ఉపయోగించవచ్చు. బెల్లం గులాబ్ జామున్లకు మంచి రంగుతోపాటు రుచిని ఇస్తుంది. ఖర్జూరాలను నీటిలో నానబెట్టి మెత్తగా చేసి సిరప్లా ఉపయోగించవచ్చు. తేనెను మాత్రం వేడి చేయకుండా చివర్లో కలపాలి.
జామున్ పిండి తయారీ : గులాబ్ జామున్ మిక్స్ను ప్యాకెట్పై ఉన్న సూచనల ప్రకారం పాలు లేదా నీటితో కలిపి మెత్తటి ముద్దలా చేసుకోవాలి. ఇంట్లోనే తురిమిన పన్నీర్, కొద్దిగా మైదా, చిటికెడు బేకింగ్ పౌడర్, కొద్దిగా పాలు కలిపి మెత్తగా చేసుకున్న మిశ్రమంతో కూడా గులాబ్ జామున్లు తయారుచేసుకోవచ్చు. పిండిని 10–15 నిమిషాలు పక్కన పెట్టి, ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా పగుళ్లు లేకుండా చేసుకోవాలి.
బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. నూనె కాస్త వేడైన తర్వాత జామున్ ఉండలను వేసి తక్కువ మంటపై గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. అన్ని వైపులా సమానంగా వేగేలా జాగ్రత్తగా తిప్పాలి.
బెల్లం పాకం : ఒక గిన్నెలో సుమారు ఒక కప్పు నీరు, తీపికి సరిపడా బెల్లం వేసి మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత సిరప్ను వడకట్టి మళ్లీ గిన్నెలో పోయాలి. అందులో యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి మరో 2–3 నిమిషాలు మరిగించాలి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. సిరప్ కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది.
ఖర్జూరం సిరప్ : గింజలు తీసిన సుమారు ఒక కప్పు ఖర్జూరాలను అర కప్పు వేడి నీటిలో 15–20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ను సుమారు ఒక కప్పు నీటితో కలిపి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి.
తేనె సిరప్ : వేయించిన జామున్లను ముందుగా కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి వాటిపై రుచికి సరిపడా తేనె, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. తేనెను నేరుగా వేడి చేయకుండా చివర్లో కలపడం మంచిది.







కామెంట్లు (0)