హంసపురంలో ఉండే రాము ఐదో తరగతి చదువుతున్నాడు. పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో తనకు నచ్చిన వస్తువును కొనుక్కుందామని వాటిని దాచుకున్నాడు. అది వేసవికాలం. ఒకరోజు తాను పొదుపు చేసిన డబ్బును మిత్రులకు చూపిద్దామని వారి ఇంటికి వెళ్లాడు. అక్కడికి మామిడి పండ్లు అమ్మకానికి వచ్చాయి. రాము తాను దాచుకున్న డబ్బుతో కొన్ని మామిడి పండ్లు కొని మిత్రులకు ఇచ్చి, కొన్ని తిన్నాడు. తర్వాత తల్లిదండ్రుల కోసం రెండు పండ్లు పట్టుకుని మిత్రులతో కలిసి తన ఇంటికి బయలుదేరాడు.
అప్పటికే మధ్యాహ్నం అయింది. దారిలో తమ ముందు నడుచుకుంటూ వెళుతున్న ఒక వృద్ధుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. రాముతో పాటు తన మిత్రులు ఆ వృద్ధుడిని వెంటనే పైకి లేపి నీడన కూర్చోబెట్టారు. రాము పరుగెత్తుకుంటూ వెళ్లి కొన్ని నీళ్లు, కొబ్బరి బొండం కొనుక్కొని వచ్చాడు. అతని ముఖంపై నీళ్లు చల్లి, కొబ్బరి బొండం నీళ్లు తాగించాడు. ఒక ఆటో మాట్లాడి ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే చికిత్స అందడంతో ఆ వృద్ధుడు కోలుకున్నాడు. ఇంటికి వెళ్లే ముందు తన చేతిలో ఉన్న రెండు పండ్లను ఆ తాతకు ఇచ్చాడు రాము. ఇంటికి వచ్చాక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు ఎంతో సంతోషించారు. తాను చేసిన మంచి పని తన తల్లిదండ్రులకు నచ్చినందుకు రాము చాలా ఆనందపడ్డాడు.
– తాళ్లపల్లి రేవతి, 9వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అనంతసాగర్, సిద్దిపేట జిల్లా







కామెంట్లు (0)