- సమ్మెకు ఐద్వా, ప్రజారోగ్య వేదిక, ఎస్ఎఫ్ఐ మద్దతు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
స్టైపెండ్ పెంపుతోపాటు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ప్రజారోగ్య వేదిక(పిఎవి) ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశాయి. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల వద్ద సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి రమణయ్య టి కామేశ్వరరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ వేలాది మంది జూనియర్ డాక్టర్లు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. శ్రమకు తగిన గుర్తింపుగా స్టైపెండ్ను 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైద్యులను బెదిరించడం, చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం సరికాదన్నారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సోమవారం నుంచి అత్యవసర సేవలకు కూడా అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి చర్చలు జరిపి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరారు.జూనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పిజి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పిజిలు, సీనియర్ రెసిడెంట్లు అత్యవసర వైద్య సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమ్మె కొనసాగితే రోగుల సంరక్షణకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని వైద్యుల ప్రతినిధి బృందాన్ని వెంటనే చర్చలకు పిలిచి, సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.







కామెంట్లు (0)