- 6 లక్షల మందికి పైగా తరలింపు
- వందలాది విమానాలు రద్దు
బీజింగ్ : ప్రచండ వేగంతో బవి తుపాను చైనాలోని తూర్పు ఝిజియాంగ్ ప్రావిన్స్ వైపు దూసుకువస్తుండడంతో ముందస్తు జాగ్రత్తగా లక్షలాది మంది ప్రజలను ఇళ్ళ నుండి ఖాళీ చేయించారు. జపాన్లోని సకిషిమా దీవులను, ఉత్తర తైవాన్ను దారుణంగా దెబ్బతీసిన ఈ తుపాను కొంచెం శాంతించినప్పటికీ ఇంకా ప్రమాదకారిగానే వుందని వాతావరణవేత్తలు తెలిపారు. వర్షపు మేఘాలతో భారీగా తేమను మోసుకువస్తుండడంతో ఈ తుపాను పెద్దమొత్తంలో ముప్పు కలిగించగలనదని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నాలుగు స్థాయిలో ఈ తుపాను రెండో స్థాయిగా పేర్కొంటూ ఆరంజ్ ఆలర్ట్ జారీ చేశారు. వందలాది విమానాలను రద్దు చేశారు. రైలు సర్వీసులను తగ్గించారు. పాఠశాలలు మూసివేశారు, ఫెర్రీ సేవలను నిలిపివేశారు. ఝిజియాంగ్లో జనసాంద్రత బాగా వున్న వెంజూలో ఆదివారం తెల్లవారు జామునకు తుపాను తీరం దాటుతుందని భావిస్తున్నారు. తుపాను తీరం దాటిన అనంతరం ఆ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అందుకే ఝిజియాంగ్ ప్రావిన్స్లో ఐదు లక్షల మందికి పైగా, పొరుగున గల ఫుజియాన్ ప్రావిన్స్లో లక్షమందికి పైగా ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో దక్షిణచైనాలో సంభవించిన తుపానులో 39మంది మరణించారు. మరోవైపు ఫిలిప్పీన్స్లో రుతుపవనాలు చురుకుగా వుండడంతో కురిసిన భారీ వర్షాల వల్ల 17మంది మరణించారు. దీనికి తోడు బావి తుపానుతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. జపాన్లో ఈ తుపాను కారణంగా 200కి పైగా విమానాలు రద్దుయ్యాయి.








కామెంట్లు (0)