ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కుకు కోహ్లీ (77) మృతి చెందారు. మంగళవారం తీవ్ర గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1991లో విడుదలైన ‘ఫూల్ ఔర్ కాంటే’ చిత్రంతో అజయ్ దేవ్గన్ను బాలీవుడ్కు పరిచయం చేసిన దర్శకుడిగా కుకు కోహ్లీ ప్రత్యేక గుర్తింపు పొందారు. అసలు పేరు అవతార్ కోహ్లీ అయిన ఆయన.. దర్శకుడిగా అరంగేట్రం చేయకముందు ప్రముఖ దర్శకుడు రాజ్ కపూర్ సహా పలువురు చిత్రనిర్మాతల వద్ద పనిచేశారు. ‘ఫూల్ ఔర్ కాంటే’ చిత్రమే అజయ్ దేవ్గన్ సినీ కెరీర్కు నాంది పలికింది. కుకు కోహ్లీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. అసౌకర్యంగా అనిపించడంతో మంగళవారం ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు చిత్రనిర్మాత, ఆయన స్నేహితుడు అశోక్ పండిట్ పీటీఐకి తెలిపారు.
‘ఫూల్ ఔర్ కాంటే’ తర్వాత కుకు కోహ్లీ ‘కోహ్రామ్’, ‘సుహాగ్’, ‘హకీకత్’, ‘అనారీ నెం.1’, ‘యే దిల్ ఆషిఖానా’, ‘వో తేరా నామ్ థా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
కుకు కోహ్లీ మృతితో బాలీవుడ్లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు నటి అరుణా ఇరానీ భార్యగా ఉన్నారు. గత వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుకు కోహ్లీ అంత్యక్రియలు బుధవారం ఓషివారా శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.







కామెంట్లు (0)