'దందా' వెబ్ సిరీస్లో అరవింద్ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని నటుడు దొర సాయి తేజ తెలిపారు. ఈ విజయం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టేలా మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. 'దందా' సిరీస్కు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలంగా ఎదురుచూసిన సవాలుతో కూడిన పాత్ర 'దందా'లో దక్కిందని, దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తనపై ఉంచిన నమ్మకమే ఆ పాత్రను ప్రేక్షకులకు చేరువ చేసిందని పేర్కొన్నారు. "మంచి కథతో పాటు సరైన మార్కెటింగ్ కూడా విజయానికి కీలకం. రూ.15 లక్షలు పోయాయనే కాన్సెప్ట్తో రూపొందించిన ప్రచార వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అదే సిరీస్కు మంచి స్పందన తీసుకురావడంలో ఉపయోగపడింది" అని వివరించారు.
సోషల్ మీడియా తనకు ఉపాధి అయితే, సినిమా తన ప్యాషన్ అని సాయి తేజ చెప్పారు. సోషల్ మీడియాలో ఏర్పడిన అభిమానాన్ని థియేటర్ల వరకు తీసుకెళ్లాలనేదే తన లక్ష్యమని, కేవలం ఇన్ఫ్లూయెన్సర్గా కాకుండా నటుడిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. "ప్రేక్షకులు నా సినిమా కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేసేలా పనిచేయాలనేదే నా లక్ష్యం" అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రతి సాధారణ వ్యక్తి తనను తాను చూసుకునేలా ఉండే కథల్లో నటించాలనేది తన ఆకాంక్ష అని అన్నారు.








కామెంట్లు (0)