ప్రముఖ హీరో మహేష్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి కీలక అప్డేట్ను వెల్లడించారు. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ‘వారణాసి’ 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ కథను 2022 నుంచే డెవలప్ చేయడం ప్రారంభించాం. అంటే దాదాపు నాలుగున్నరేళ్లు పట్టింది’’ అని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, పూర్తయిన సన్నివేశాలను ఎప్పటికప్పుడు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విభాగానికి పంపిస్తున్నామని చెప్పారు. కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా మంచు ఖండం, ఆఫ్రికా దట్టమైన అడవులను దాటుకుంటూ రామాయణ కాలానికి వెళ్లి, చివరకు మళ్లీ వారణాసికే చేరుకుంటుందని చెప్పారు. అంటార్కిటికాలోని 300 అడుగులకు పైగా ఉన్న భారీ మంచుకొండ, రామాయణంలోని వానరసేన వంటి కీలక సన్నివేశాలను అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఐమ్యాక్స్ సాంకేతికతను వినియోగించామని చెప్పారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.
‘వారణాసి’ 80 శాతం షూటింగ్ పూర్తి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)