- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
లండన్: బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)లో పైలట్గా పట్టభద్రుడైన తొలి భారతీయ-సిక్కుగా ఫ్లైట్ లెఫ్టినెంట్ అర్ష్దీప్ సింగ్ డాంగ్ చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్లోని ఫైటర్ స్క్వాడ్రన్కు సిక్కు పైలట్ను నియమించడం ఇదే తొలిసారి అని ఆర్ఏఎఫ్ తెలిపింది. 28 ఏళ్ల అర్ష్దీప్ ఆగస్టు 14న ఉత్తర వేల్స్లోని ఆర్ఏఎఫ్ వ్యాలీలో జరిగిన ఫాస్ట్ జెట్ పైలట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పట్టా అందుకున్నారు. 1998లో చండీగఢ్లో జన్మించిన ఆయన ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకేకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆయన కుటుంబం ఇంగ్లాండ్లోని సౌతాల్లో నివసిస్తోంది. అర్ష్దీప్ తండ్రి జగ్దీప్ సింగ్ డాంగ్ లుధియానాకు, తల్లి గగన్దీప్ కౌర్ అమృత్సర్కు చెందినవారు. "పైలట్ కావాలన్నది మా తాతగారైన సర్దార్ సంతోఖ్ సింగ్ డాంగ్ గారి కల. కానీ మా నాన్నగారికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు మా తాతగారు చనిపోయారు. అందువల్ల మా నాన్నగారికి తన కలను నెరవేర్చుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. మా అమ్మానాన్నలు నాకు అండగా నిలిచి నన్ను ప్రోత్సహించారు. నేను పైలట్ కాగలనని నాకు గట్టి నమ్మకం ఉండేది, అలాగే అయ్యాను," అని అర్ష్దీప్ చెప్పారు. బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గణితం, తత్వశాస్త్రం అభ్యసించిన అర్ష్దీప్ 2022 ఫిబ్రవరిలో ఆఫీసర్ శిక్షణ పూర్తి చేశారు. 2023లో ప్రాథమిక ఫ్లయింగ్ శిక్షణను పూర్తిచేసి, 2024లో ఫాస్ట్ జెట్ స్ట్రీమ్కు ఎంపికయ్యారు. 2025 మార్చిలో ఫాస్ట్ జెట్ లీడ్-ఇన్ శిక్షణ, అదే ఏడాది జూలైలో బేసిక్ ఫాస్ట్ జెట్ శిక్షణ ప్రారంభించారు. 2026 జూలైలో వింగ్స్ టెస్ట్లో ఉత్తీర్ణులైన అర్ష్దీప్, ఫ్రంట్లైన్ ఫైటర్ విమానాలను నడిపే స్థాయికి చేరుకునేందుకు మరో ఏడాది పాటు కఠినమైన శిక్షణ పొందనున్నారు.







కామెంట్లు (0)