ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు చైనాలో విషాదాన్ని మిగిల్చాయి. చాంగ్కింగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో పది మందికి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 34 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వుజియాంగ్ నది సమీపంలోని పెంగ్షుయ్ కౌంటీలో ఈ ప్రమాదం సంభవించింది. కుండపోత వర్షాల ధాటికి కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు జారిపడటంతో 10కి పైగా నివాస భవనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ ‘లెవెల్-II’ జాతీయ అత్యవసర ప్రతిస్పందనను ప్రకటించింది. విపత్తు నివారణ కమిషన్ కూడా సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాన్ని పంపింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 1,100 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.







కామెంట్లు (0)