- భగవత్ను అమెరికాలో అడుగు పెట్టనీయవద్దు
- సిక్కు సంఘాల అభ్యతరం
వాషింగ్టన్ : భారతదేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్స్ఎస్) మైనారిటీలపై హింస, వివక్ష, వేధింపులను ప్రోత్సహిస్తోందని, ఆ సంస్థ అధిపతి మోహన్ భగవత్ను దేశంలో అడుగు పెట్టనీయవద్దని అమెరికాకు చెందిన మూడు సిక్కు సంస్థలు విదేశాంగ మంత్రి మార్కో రుబియోను కోరాయి. భగవత్ మంగళవారం వాషింగ్టన్ రానున్న నేపథ్యంలో అమెరికన్ సిక్కు కాకస్ కమిటీ, సిక్కు కోఆర్డినేషన్ కమిటీ ఈస్ట్కోస్ట్, అమెరికన్ గురుద్వార్ ప్రబంధక్ కమిటీ గత వారం రుబియోకు సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. భగవత్ పర్యటనను నిరాకరించాలని అందులో కోరాయి. ఈ నెల 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగబోయే బహిరంగ కార్యక్రమానికి భగవత్ హాజరు కావాల్సి ఉన్నదని తెలిపాయి.
మత స్వేచ్ఛకు ఆర్ఎస్ఎస్ ముప్పు..
భారత్లో మత స్వేచ్ఛకు ఆర్ఎస్ఎస్ నుంచి ఎదురవుతున్న ముప్పుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ అధిపతిని దేశంలోకి అనుమతించడం, తప్పుడు సంకేతాలను పంపుతుందని సిక్కు సంస్థలు తమ లేఖలో వివరించాయి. మతపరమైన మైనారిటీలకు హాని కలిగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల నాయకులకు దౌత్య మర్యాదలు, ఉన్నత స్థాయి ప్రవేశం కల్పించడం సరికాదని తెలిపాయి. ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలంటూ అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్సిఐఆర్ఎఫ్) పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ సభ్యుడని, దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు మైనారిటీలపై దాడులకు పాల్పడ్డాయని కమిషన్ ఛైర్మన్ ఆసిఫ్ మహమూద్ ఆరోపించారు. యూఎస్సిఐఆర్ఎఫ్ ఇటీవల భారత్ను ‘ఆందోళన కలిగించే ప్రత్యేక దేశం’గా పేర్కొనడంతో పాటు మత స్వేచ్ఛపై పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సంస్థ విమర్శలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చుతూ కమిషన్ను పక్షపాత పూరితమైన సంస్థగా అభివర్ణించింది. బిజెపికి సైద్ధాంతిక మాతృసంస్థగా పరిగణించే ఆర్ఎస్ఎస్, దాని విద్వేష సిద్ధాంతం, మత మైనారిటీలపై అది చూపుతున్న ప్రభావం దీర్ఘకాలంగా విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.







కామెంట్లు (0)