వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహూల మధ్య సమావేశం కొనసాగుతుండగా.. వైట్హౌస్ ఎదుట భారీ నిరసన జరిగింది. పలువురు కార్యకర్తలు, యూదు వ్యతిరేక సంఘాలు సహా పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నెతన్యాహూకి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. నెతన్యాహూ పర్యటనను, గాజాపై దాడులను తీవ్రంగా వ్యతిరేకించారు. యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహూ, ఇజ్రాయిల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్లకు వ్యతిరేకంగా ఐసిసి జారీ చేసిన అరెస్ట్ వారెంట్ను అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు వాషింగ్టన్కు రాకకు ముందు, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ, డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా ఐసిసి న్యాయపరమైన విచారణలకు సహకరించాలని అమెరికా అధికారులను కోరారు.
ట్రంప్, నెతన్యాహూల మధ్య చర్చలు
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహూల మధ్య రహస్య చర్చలు జరిగాయి. మంగళవారం వైట్హౌస్లో సుమారు 90 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఐదు నెలల క్రితం ఇరాన్పై సైనిక చర్యలు ప్రారంభించిన తర్వాత ఇది వారి మొదటి సమావేశం. అలాగే 2025 జనవరిలో ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఎనిమిదవ సమావేశం. వారితో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో, రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం "సానుకూలంగా, ప్రయోజనకరంగా’’ సాగిందని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అభివర్ణించారు. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడంపై ఈ చర్చలు దృష్టి సారించాయని నెతన్యాహు అన్నారు.








కామెంట్లు (0)