ఎన్సిఎల్టి తీర్పునపై సవాల్
ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్,*హెచ్డిఎఫ్సి బ్యాంక్ యోచన
ముంబయి : జీ గ్రూప్నకు సంబంధించిన రూ.22,006 కోట్ల రుణాల పరిష్కార ప్రణాళికపై రుణదాతల మధ్య విభేదాలు ముదిరాయి. ఢిల్లీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) ఆమోదించిన ఈ ప్రణాళికను హెచ్డిఎఫ్సి బ్యాంక్ పై ట్రిబ్యునల్లో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బి) ద్వారా ఈ వ్యవహారంలో జోక్యం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీతో తీసుకున్న ఈ రుణాల పరిష్కార ప్రణాళికను ఢిల్లీలోని ఎన్సిఎల్టి ధర్మాసనం మంగళవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రధాన రుణగ్రహీతలు రూ.1,494 కోట్లు చెల్లించనుండగా, వ్యక్తిగత గ్యారంటర్ అయిన సుభాష్ చంద్ర కేవలం రూ.6.25 కోట్లు మాత్రమే చెల్లించనున్నారు. మొత్తం రూ.22,006 కోట్ల రుణానికి గాను ఈ మొత్తాన్ని చెల్లించేలా రూపొందించిన ఈ ప్రణాళికకు పలువురు రుణదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి పలు లెండర్లు ఈ చెల్లింపుల ప్రణాళికను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. రూ.22,006 కోట్ల రుణాన్ని సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్నట్లు భావించడం సరికాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం మరోమారు బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ గద్దలకు అనుకూలమని నిరుపణ అయ్యిందనే విమర్శలు పెరిగాయి. జీ, ఎస్సెల్ గ్రూప్కు చెందిన పలు సంస్థలు తీసుకున్న రుణాలకు ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నారని పేర్కొన్నాయి.








కామెంట్లు (0)