మంబయి : రాజేష్ ఎక్స్పోర్ట్స్లో వెలుగుచూసిన భారీ ఆదాయ అవకతవకల వ్యవహారంపై నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఎ) దర్యాప్తు ప్రారంభించింది. మంగళవారం ముంబయిలో ఎన్ఎఫ్ఆర్ఎ చైర్పర్సన్ నితిన్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఇటీవల సెబీ దర్యాప్తులో కంపెనీ ఏళ్ల తరబడి ఆదాయాన్ని తప్పుగా చూపుతూ సుమారు రూ.15.5 లక్షల కోట్ల మేర ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో ఆ సంస్థ ఆడిటర్ల పాత్రపై విచారణ చేపట్టాలని సెబీ ఎన్ఎఫ్ఆర్ఎను కోరింది. ఈ మేరకు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైనట్లు గుప్తా వెల్లడించారు. అయితే విచారణ ఎప్పుడు పూర్తవుతుందనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ సందర్భంగా కార్పొరేట్ పాలన, బోర్డు సభ్యుల బాధ్యతలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రమోటర్ల ఆధిపత్యం ఉన్న భారతీయ కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్లు యాజమాన్య నిర్ణయాలను ప్రశ్నించే స్వేచ్ఛతో వ్యవహరించాలని.. కేవలం నిబంధనలు ఉండటం కాకుండా వాటిని అమలు చేసే విధానమే మంచి కార్పొరేట్ పాలనకు కీలకమని పేర్కొన్నారు. అలాగే ఆర్థిక నివేదికల తయారీలో ఎఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ.. తుది నిర్ణయాలు మాత్రం మానవ పరిశీలనతోనే తీసుకోవాలన్నారు. ఎఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా క్షుణ్ణంగా విశ్లేషించాలని ఆడిటర్లు, బోర్డు సభ్యులకు సూచించారు.








కామెంట్లు (0)