ముంబయి : టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) అనుకున్నట్లుగానే వాయిదా పడింది. తగినంత కోరమ్ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. టాటా గ్రూపు కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. మళ్లీ ఎప్పుడు ఎజిఎం నిర్వహించాలనే అంశంపై బోర్డు సభ్యులతో ఛైర్మన్ సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 18న బాంబే హౌస్లో నిర్వహించ తలపెట్టిన ఎజిఎంకు ఛైర్మన్ చంద్రశేఖరన్, కొందరు బోర్డు సభ్యులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. నోయల్ టాటా, మెహ్లీ మిస్త్రీ సహా మరికొందరు సైతం ఆన్లైన్లో హాజరయ్యారు. అయితే మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన నిషేధం కారణంగా టాటా సన్స్లో కీలక వాటాదారు అయిన సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్ఆర్టిటి) తన ప్రతినిధిని నామినేట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ట్రస్ట్ ప్రతినిధి గైర్హాజరీతో కోరమ్ లేకపోవడంతో ఎజిఎం వాయిదా పడింది. ఇదే విషయాన్ని మరో ట్రస్ట్ అయిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ముందుగానే టాటా సన్స్కు తెలియజేసింది. దీంతో ఎజిఎం వాయిదా ముందుగా ఊహించినదే. వాస్తవానికి ఈ సమావేశంలో టాటా సన్స్కు ప్రస్తుత చంద్రశేఖరన్ను డైరెక్టర్గా రీనామినేట్ చేసే అంశం పరిశీలనతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సర ఏకీకృత ఖాతాలను పరిశీలించి, ఆమోదించాల్సి ఉంది. అదే విధంగా డివిడెండునూ ప్రకటించాల్సి ఉంది.







కామెంట్లు (0)