- దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అధికారంలో వున్న లేదా శక్తివంతులైన వ్యక్తులను విచారించాలన్నా లేదా దర్యాప్తు జరపాలన్నా వెనుకడుగు వేసే దర్యాప్తు సంస్థలు సామాన్యుల విషయంలో మాత్రం అత్యంత దూకుడుతో ముందుకు వస్తాయని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. భూ కబ్జా కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీకి వ్యక్తిగత సహాయకుడైన సుమిత్రాయ్ దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సందర్భంగా రాయ్ అరెస్టుపై సుప్రీం స్టే విధించింది. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సిందిగా ఆయనను ఆదేశించింది. రాయ్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ, ప్రధానంగా ఇడి ప్రశ్నించినదంతా రాయ్ కుటుంబం, ఆయన రాజకీయ పార్టీ కార్యకలాపాల గురించే వున్నాయని తెలిపారు. కచ్చితంగా ఏదో ఒక సమయంలోనైనా తన క్లయింట్పై మోపిన నేరం గురించి వారు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని శంకర్నారాయణన్ అన్నారు. ఇడి తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, రాయ్ను ఇడి విచారించిందని, ఆయన రూ.2కోట్లు డిపాజిట్ కూడా చేశారని తెలిపారు. అభిషేక్ బెనర్జీకి సంబంధమున్న లీప్స్ అండ్ బౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రాయ్ రూ.30కోట్లు బదిలీచేశారని మెహతా వాదించారు. అక్రమ ఆర్థిక అవకతవకలపై ఇడి దర్యాప్తును ఈ కంపెనీ ఎదుర్కొంటోంది. దర్యాప్తు ప్రక్రియలోని నిలకడ, న్యాయం నిష్పాక్షికత గురించి కోర్టు ప్రశ్నించింది. విచారణను ఎదుర్కొనే వ్యక్తి అధికారంలో వున్నావారా లేక సామాన్యుడా అనేదానితో నిమిత్తం లేకుండా దర్యాప్తు సంస్థలు ఈ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయా లేదా అని జస్టిస్ బగ్చి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆరోపించిన నేరం, డబ్బు జాడ గురించి సుమిత్ రాయ్ను సక్రమంగా విచారించారా లేదా అనేది నిర్ధారించుకోవడానికి గానూ రాయ్ దర్యాప్తునకు సంబంధించిన ఆడియో/వీడియో రికార్డింగ్లను అందచేయాలని ఇడిని న్యాయస్థానం ఆదేశించింది. సెప్టెంబరు 7వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.







కామెంట్లు (0)