సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశం తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం విఫలమయిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుదల, పెట్టుబడులపై ఆందోళనలు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. విద్య, వైద్య రంగాలను బలహీనపరుస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలను మరింత పెంచుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ ‘బడ్లావ్ జరూరీ హై’ (మార్పు తప్పనిసరి) ప్రచారాన్ని చేపట్టిందని గురువారం నాడిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించినట్లు తెలిపారు. అనేక ప్రాంతాల్లో పాదయాత్రలు ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ర్యాలీకి దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, రైతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని డి.రాజా తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఆర్ఎస్ఎస్-బిజెపి భిన్నాభిప్రాయాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని డి.రాజా విమర్శించారు. ఈ సందర్భంగా ‘బడ్లావ్ జరూరీ హై: డి.రాజా రచనలు’, ఎన్నికల సంస్కరణలు, మహిళా రిజర్వేషన్, ‘వర్కర్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్’, ‘బిజెపి గ్రేట్ బిట్రేయల్: లీగల్ గ్యారెంటీ ఆఫ్ ఎంఎస్పి’, ‘రామ్ టెంపుల్ డొనేషన్ థెఫ్ట్: రన్నింగ్ ఫ్రమ్ 1949 టిల్ టుడే’ తదితర పుస్తకాలను విడుదల చేశారు.







కామెంట్లు (0)