న్యూఢిల్లీ : 2013 లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను బాంబే హైకోర్టు గురువారం దోషిగా నిర్థారించింది. నిర్దోషిగా విడుదల చేస్తూ సెషన్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టులోని గోవా బెంచ్కి చెందిన జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమసందేకర్లతో కూడిన ధర్మాసనం శిక్షకు సంబంధించిన ఉత్తర్వులను మధ్యాహ్నం వెల్లడించనుంది.
2013 నవంబర్లో ఒక హోటల్లో తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అదే ఏడాది తేజ్పాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపిసిలోని సెక్షన్లు 376 (2)(f),354(a),354(b) కింద తేజ్పాల్ దోషిగా నిర్ధారించబడ్డారు. సెక్షన్ 376 ప్రకారం, తేజ్పాల్కు కనీసం పదేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ తేజ్పాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ అభియోగాలను కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ, ఆరునెలల్లోగా విచారణను ముగించాలని ఆదేశించింది.
ప్రాసిక్యూషన్ ఈ కేసును నిరూపించడంలో విఫలమైందంటూ 2021లో గోవా సెషన్స్ కోర్టు తేజ్పాల్పై అన్ని అభియోగాలను కొట్టివేస్తూ నిర్దోషిగా విడుదల చేసింది. మెడికల్ సాక్ష్యాలు లేవని, కేవలం ఫిర్యాదుదారు, తేజ్పాల్ల మధ్య సంభాషణపై మ్రాతమే ఆధారపడిందని సెషన్స్ కోర్టు పేర్కొంది. లైంగిక దాడి కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఆ సంభాషణ మద్దతు ఇవ్వడం లేదని నిర్థారించింది. తేజ్పాల్ను నిర్దోషిగా విడుదల చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాలు చేసింది.








కామెంట్లు (0)