పలువురు గల్లంతు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం తెల్లవారుజామున పూంచ్ జిల్లాలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడంతో నలుగురు మృతిచెందగా, పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సురన్కోట్ తహసీల్లో ముగ్గురు మహిళలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నూనాబండి గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో 28 ఏళ్ల నాజియా కౌసర్ మృతిచెందగా, ఆమె భర్త మహ్మద్ హఫీజ్, ఇద్దరి నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న ముగ్గురు చిన్నారులను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు.
ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పౌర పరిపాలన, జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరుతున్నట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ప్రాణనష్టం పట్ల ఆయన తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.








కామెంట్లు (0)