జావెలిన్ క్షిపణుల కొనుగోలుకు ఒకె
న్యూఢిల్లీ : జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థ కొనుగోలు కోసం అమెరికాతో ఒక ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. అమెరికా విదేశీ సైనిక అమ్మకాల (ఎఫ్ఎంఎస్) మార్గం ద్వారా వీటిని కొనుగోలు చేయడానికి ఎల్ఓఎపై భారత్ సంతకం చేసిందని తెలిపింది. ఈ ఒప్పందాన్ని రాయబార కార్యాలయం స్వాగతించింది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించింది. ఈ ఒప్పందంతో జావెలిన్ వ్యవస్థకు భారత్ మరొక వినియోగదారుగా మారిందని రాయబార కార్యాలయం తెలిపింది. జావెలిన్ అనేది ఒక మధ్యశ్రేణి, "ఫైర్-అండ్-ఫర్గెట్" (ప్రయోగించి మరచిపోయే) ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి. ఇది యుద్ధ ట్యాంక్లతో సహా సాయుధ వాహనాలు, సైనిక స్థావరాలు.. మొదలైన లక్ష్యాలను ఛేదించడానికి అభివృద్ది చేశారు. ఈ క్షిపణులను ఆర్టిఎక్స్, లాక్హీడ్ మార్టిన్లతో కూడిన జావెలిన్ జాయింట్ వెంచర్ ఉత్పత్తి చేస్తుంది. వీటిని ప్రస్తుతం అమెరికా సైన్యం, అమెరికా మెరైన్ కార్ప్స్, మరికొన్ని దేశాల సైన్యం ఉపయోగిస్తున్నాయి.








కామెంట్లు (0)