న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్జిఎ) 81వ వార్షిక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 26న మధ్యాహ్నం జరిగే సాధారణ చర్చలో జైశంకర్ ప్రసంగించనున్నట్లు శుక్రవారం విడుదలైన సవరించిన తాత్కాలిక వక్తల జాబితా తెలిపింది. గత ఏడాది కూడా ఆయన యుఎన్జిఎ వేదికగా ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. యుఎన్జిఎ 81వ సమావేశం సెప్టెంబర్ 8న ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు సాధారణ చర్చ జరగనుంది. 193 సభ్య దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 22న బ్రెజిల్ తొలి ప్రసంగం చేయనుంది. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత యుఎన్జిఎలో ఆయనకు ఇది రెండో ప్రసంగం కానుంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, ఆహార, ఇంధన భద్రత వంటి కీలక అంశాల నేపథ్యంలో ఈ ఏడాది యుఎన్జిఎ సమావేశాలు జరగనున్నాయి. అభివృద్ధి హక్కు, వాతావరణ చర్యలు, సముద్ర మట్టాల పెరుగుదల, మహమ్మారి సంసిద్ధత, అణ్వాయుధాల నిర్మూలన తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్, నేపాల్ ప్రభుత్వాధినేతలు సాధారణ చర్చలో ప్రసంగించనుండగా, సెప్టెంబర్ 25న పాకిస్తాన్ ప్రసంగించనుంది. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్కు ఇది చివరి ఉన్నతస్థాయి యుఎన్జిఎ సమావేశం కానుంది. ఆయన రెండవ పదవీకాలం (ఐదేళ్లు) ఈ ఏడాది డిసెంబర్లో ముగియనుంది. తదుపరి ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.
యుఎన్జిఎలో ప్రసంగించనున్న జైశంకర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 12:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)