- ఏడుగురు మృతి - ఆపై ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
- మరో 9 మంది పరిస్థితి విషమం
బ్యాంకాక్ : థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగర శివార్లలోని ఒక పాఠశాలలో, తన ఇంటి వద్ద, పాఠశాలలో ఒక విద్యార్ధి జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందారు. అనంతరం ఆ విద్యార్ధి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత ఇంటివద్ద అమ్మమ్మ తాతయ్యలను కాల్చి చంపిన ఆ విద్యార్ధి పాఠశాలలో ఐదుగురు టీచర్లపై కాల్పులు జరిపి హతమార్చాడు. అయినా ఆ విద్యార్ధి వద్ద ఇంకా 30కి పైగా తూటాలు మిగిలివున్నాయని థాయిలాండ్ ప్రధాని అనుటిన్ చర్న్విరాకుల్ తెలిపారు. విలేకర్లకు ఆయన ఈ సంఘటన వివరాలు వెల్లడించారు. మరణించిన వారికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. దేశంలో కఠినమైన తుపాకీ చట్టాలు అమల్లో వున్నాయని, అయినా ఇలాంటి సంఘటన ఎలా జరిగిందో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మరో 9 మంది పరిస్థితి విషమంగా వుందని అధికారులు చెప్పారు. రక్త దానాలు చేయాల్సిందిగా పిలుపిచ్చారు. థాయిలాండ్లో బాగా ప్రతిష్మాత్మకమైన దేవ్శిరిన్ స్కూల్కి చెందిన స్థానిక బ్రాంచ్లో ఈ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. దేశంలోని పలువురు ప్రముఖులు ఈ స్కూల్ విద్యార్ధులే, ప్రధానుల నుండి క్రీడాకారులు, దౌత్యవేత్తల వరకు అనేకమంది ఇక్కడ చదువుకున్నవారే. జాతీయ పోలీసు చీఫ్ జనరల్ కిట్టిరాట్ ఫాన్ఫెట్ విలేకర్లతో మాట్లాడుతూ, హంతకుడి కాల్పులు చాలా కచ్చితత్వంతో జరిపినట్లుగా వున్నాయని ఫోరెన్సిక్ అధికారులు తెలిపారని, చాలా తూటాలు శరీరంలోని కీలకమైన భాగాల్లోకి దూసుకువెళ్ళాయని తెలిపారు. ఆ విద్యార్ధి వాడిన తుపాకీ తన తాతదే, ఆయన పూర్వపు ఉపాధ్యాయుడు. కాగా, ఈ దాడులు చాలా ముందస్తు ప్రణాళికతో, అత్యంత పకడ్బందీగా రూపొందించి అమలు చేసినవేనని ప్రధాని వ్యాఖ్యానించారు. కాల్పుల భయంతో పాఠశాల నుండి బయటకు వచ్చిన ఒక విద్యార్ధిని మీడియాతో మాట్లాడుతూ, కాల్పులకు పాల్పడిన విద్యార్ధి ప్రతీ తరగతి గదిని చూసుకుంటూ రావడం గమనించానని, తమ గది వద్దకు రాగానే ఒక్కసారిగా నిలబడి టీచర్పైకి కాల్పులు జరిపాడని, ఇక తర్వాత తాను అక్కడ నుండి పారిపోయి వచ్చేశానని చెప్పారు.








కామెంట్లు (0)